నక్సల్స్ ఎన్కౌంటర్పై న్యాయవిచారణకు డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని హస్తినాపురంలో జరిగిన నక్సల్స్ దంపతుల ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని వారి బంధువులు, సిపియుయస్ఐ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సిపియుయస్ ఐకి చెందిన యాదన్న, స్వరూపలను పోలీసులు ఏకపక్షంగా కాల్చి చంపి, ఎన్కౌంటర్ కథ అల్లారని సిపియుయస్ ఐ ఇప్పటికే ప్రకటించింది.
నక్సల్స్ దంపతుల మృతదేహాలకు గురువారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమయంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, నక్సల్స్ బంధువులు పెద్ద యెత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. నక్సల్స్ ఎన్కౌంటర్కు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ ఆస్పత్రికి వచ్చి నక్సల్స్ దంపతులకు నివాళులు అర్పించారు. యాదన్న, స్వరూపల ఎన్కౌంటర్ను ప్రజాగాయకుడు, కవి గోరటి ఎంకన్న ఖండించారు. ఎన్కౌంటర్ మృతుల తరలింపు సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, మృతుల బంధువులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
వనస్థలిపురం సమీపంలోని హస్తినాపురంలోని ఒక కానిస్టేబుల్ ఇంటిలో నక్సల్స్ అద్దెకు దిగారని, సమాచారం అందుకున్న తాము వెళ్లగా నక్సల్స్ కాల్పుల జరిపారని, తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అయితే వారిని పట్టుకుని కాల్చి చంపారని సిపియుయస్ఐ అంటోంది. ప్రకాశం జిల్లా యస్పీ మహేష్చంద్ర చడ్హాపై మావోయిస్టులు దాడి చేసిన కొద్ది సేపటికే సిపియుయస్ ఐ దంపతులు ఎన్కౌంటర్లో మృతి చెందారు.