తోటపల్లి కాంట్రాక్టులో అవినీతి: మైసురా
హైదరాబాద్: అర్హతలు లేని స్కాన్స్కా కంపెనీకి విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పగించారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పెద్దలకు సంబంధం ఉన్నదని, నీటి పారుదల ప్రభుత్వ సలహాదారు సీతాపతి రావుకు కంపెనీకి సంబంధం ఉన్నదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇందుకు సంబంధించిన జీరాక్స్ ప్రతులను ఆయన విలేకరులకు అందజేశారు.
స్కాన్స్కా కంపెనీ రోడ్డు పనులు మాత్రమే చేసిందని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ కంపెనీకి అనుభవం లేదని ఆయన చెప్పారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న సీతాపతిరావే బహిరంగ చర్చలో తమ ప్రశ్నలకు సమాధానాలివ్వడమేమిటని ఆయన అడిగారు. తమ ఆరోపణలు రుజువు చేసే పత్రాలన్నీ అందజేశానని, ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే తన వద్ద డాక్యుమెంట్లను వెల్లడించాలని ఆయన అన్నారు. తాము పత్రాలు చూపిస్తే దొంగిలించారనో, నకిలీవనో అంటున్నారని, ప్రభుత్వమే ఫోర్జరీకి పాల్పడి అర్హతలు కల్పిస్తోందని ఆయన అన్నారు.