భానుమతికి పెనుకొండ టికెట్ రాదు: జెసి
విశాఖపట్నం: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ ఉప ఎన్నికల్లో గంగుల భానుమతికి టికెట్ ఇవ్వబోమని పంచాయతీరాజ్ శాఖా మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి చెప్పారు. ఫ్యాక్షన్ కుటుంబానికి చెందినవారే కాబట్టే భానుమతికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.
రాయలసీమను రావణకాష్టంగా మార్చకూడదనే ఉద్దేశంతో తాము ఫాక్షనిస్టులకు పెనుకొండ టికెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాము ఓడినా ఫరవా లేదని, అయితే ఫాక్షనిస్టులను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నామని, ఎవరో ఒకరు ఆ దిశగా అడుగేయాల్సిన అవసరం ఉన్నదని భావించి తాము ఆ విధంగా అనుకుంటున్నామని ఆయన వివరించారు. తమ పార్టీ అధిష్ఠానం అభిమతం కూడా అదేనని ఆయన అన్నారు.
పెనుకొండలో ఫాక్షనిస్టు కుంపటి మూడో తరంలో కూడా రగులుతోందని, అది నాలుగో తరానికి కూడా పాకకూడదని తమ ఉద్దేశమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉందో లేదో తెలియదు గానీ తమకు ఇంగిత జ్ఞానం ఉన్నదని, అందువల్ల తెలుగుదేశం పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా తాము మాత్రం ఫాక్షనిస్టులను ప్రోత్సహించదలుచుకోలేదని దివాకర్ రెడ్డి అన్నారు.