Abortion: 6 నెలల గర్భం.. ఆర్ఎంపీ నిర్వాకం! మైనర్ బాలిక బలి
జీవనోపాధి కోసం ఎక్కడో నుంచి వలస వచ్చి స్పిన్నింగ్ మిల్లులో చాకిరీ చేస్తున్న ఒక అమాయక మైనర్ బాలిక అక్రమ మెడికల్ దందాకు ప్రాణాలు కోల్పోయింది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్హత లేని ఆర్ఎంపీ వైద్యుడి సలహాలు, ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించిన అబార్షన్ మాత్రల (MTP Kits) వల్ల తీవ్ర రక్తస్రావమై 17 ఏళ్ల మైనర్ బాలిక దారుణంగా ప్రాణాలు విడిచింది.
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సీహెచ్ రత్న మన్మోహన్ వెల్లడించిన కథనం ప్రకారం.. బోయపాలెంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న అస్సాంకు చెందిన మైనర్ బాలిక, అక్కడే పనిచేస్తున్న ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె 6 నెలల గర్భవతి అయింది. విషయం బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించిన ఆ వ్యక్తి, మైనర్ బాలిక గర్భాన్ని తీయించేందుకు అర్హత లేని ఒక ఆర్ఎంపీ డాక్టర్ను ఆశ్రయించాడు.

అతడి సూచనలతోనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఒక మెడికల్ షాపు నుంచి అబార్షన్ కిట్ కొనుగోలు చేశారు. సదరు బాలిక మూడు రోజుల పాటు ఆ మాత్రలను వాడటంతో, మూడో రోజు రాత్రి తీవ్రమైన కడుపునొప్పితో పాటు విపరీతమైన రక్తస్రావం మొదలైంది. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రహస్యంగా మారిన మెడికల్ షాప్ కథ.. పోలీసుల విచారణ!
బోయపాలెం పరిధిలోని మెడికల్ షాపు నుంచే ఈ ప్రమాదకరమైన కిట్ను కొనుగోలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తమ షాపుల నుంచి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేని మాత్రలను విక్రయించలేదని స్థానిక మెడికల్ షాపు నిర్వాహకులు బుకాయిస్తున్నారు. బాలికతో పాటు వెళ్లి ఆ మాత్రలు కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తేనే అసలు ఏ మెడికల్ షాప్ నుంచి ఈ అబార్షన్ కిట్ బయటకు వచ్చిందో, ఏ ఆర్ఎంపీ దీని వెనుక ఉన్నాడో నిజాలు బయటపడతాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
మాయమాటలతో మైనర్లకు ఎర.. మిల్లుల్లో కామాంధుల రాసలీలలు!
ఈ ఒక్క ఘటనతో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లుల వెనుక ఉన్న చీకటి కోణం బయటపడింది. ఇక్కడి మిల్లుల్లో బీహార్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేలాదిగా వలస వచ్చిన నిరుపేద కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఈ కుటుంబాల్లోని మైనర్ బాలికలను టార్గెట్ చేస్తూ, కొందరు కీచకులు మాయమాటలు చెప్పి లైంగికంగా వాడుకుంటున్నారు. గతంలోనూ పలు మిల్లుల్లో ఇలాంటి దారుణాలు జరిగినా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బడా వ్యాపారుల ఒత్తిళ్ల కారణంగా లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం ఆ మిల్లుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల తీవ్ర హెచ్చరికలు!
ఈ దారుణంపై స్పందించిన డీఎంహెచ్ఓ రత్న మన్మోహన్.. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావాలు చేసినా, అర్హత లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించినా కఠినమైన క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గర్భధారణ, గర్భస్రావం లాంటి సున్నిత విషయాల్లో తప్పనిసరిగా అర్హత కలిగిన గైనకాలజిస్టులనే సంప్రదించాలని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎంపీ వైద్యుడు, మెడికల్ షాప్ యజమానులు మరియు బాధితురాలితో ఉన్న వ్యక్తిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.














Click it and Unblock the Notifications
