పెనుకొండ దుర్ఘటన దురదృష్ఖకరం: జెసి, కెకె
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ సంఘటన దురదృష్టకరమని అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. పెనుకొండ శాసనసభ ఉప ఎన్నికను ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంచాలని తాము మొదటి నుంచీ కోరుతున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పెనుకొండలో శాంతి స్థాపనకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానవర్గం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పార్టీలకు అతీతంగా ఫ్యాక్షనిస్టులకు అందరం దూరంగా ఉండాలని తాము కోరుతున్నామని ఆయన అన్నారు. పెనుకొండలో జరిగిన సంఘటన అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. చనిపోయినవారు ఏ పార్టీకి చెందినవారో తెలియదు గానీ ఎవరు చనిపోయినా బాధాకరమేనని ఆయన అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు. పోలీసులు తమ విధి నిర్వహణ చేయక ఏం చేస్తారని ఆయన అన్నారు.
పెనుకొండ సంఘటన దురదృష్టకరమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. అయితే ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. సంయమనం పాటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇవ్వడం సంతోషకరమని ఆయన అన్నారు. ఫ్యాక్షనిజానికి దూరంగా ఉండి ఎన్నిక ప్రశాంతంగా ఉండి అందరం కృషి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిసి ఆయన పెనుకొండ సంఘటనపై చర్చించారు. రేపటి పునరంకిత కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని ఆయన చెప్పారు.