మావోయిస్టు పార్టీ అవినీతిమయం: శివసాగర్
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని మాజీ నక్సలైట్ నాయకుడు, కవి జి. సత్యమూర్తి అలియాస్ శివసాగర్ విమర్శించారు. విప్లవ కవి వరవరరావు మావోయిస్టు పార్టీలోని సంక్షోభానికి అద్దం పడుతోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీలో అవినీతిలో కూరుకుపోని నాయకులెవరైనా ఉన్నారా ఆయన ప్రశ్నించారు.
మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు లేదని, అందువల్లనే బూటకపు ఎన్కౌంటర్లు సాధ్యమవుతున్నాయని ఆయన అన్నారు. మావోయిస్టు పార్టీ గురించి తాను కాకుండా ఎవరు మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. ఒక సంక్షోభంలో తాను బయటకు వచ్చానని, మావోయిస్టు పార్టీ విషయాలు తనకు తెలుస్తాయని ఆయన అన్నారు. మావోయిస్టు పార్టీ టెర్రరిస్టు ఎత్తుగడను అనుసరిస్తోందని, టెర్రరిస్టు ఎత్తుగడతో ప్రజాయుద్ధాన్ని నడిపించలేరని ఆయన అన్నారు. సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు సరిజోడుగా సాగినప్పుడే విప్లవోద్యమం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. వరవరరావువి చాడీల ఉత్తరాలని, ఈ చాడీలకు ఎందరో బలయ్యారని, తాను అందులో ఒక్కడినని ఆయన అన్నారు.