వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాక్షన్స్‌ను పెంచడానికే సునీతకు టికెట్‌: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దేవుడితో విచారణ జరిపించమంటారని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పెనుకొండలో పోలీసుల కాల్పుల సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఆ విధంగా వ్యాఖ్య చేశాడు. పెనుకొండ సంఘటనపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించాం కదా, అది న్యాయవిచారణ కాదా? అని ఆయన అడిగారు. ఫ్యాక్షన్స్‌ సంస్కృతిని ప్రోత్సహించడానికే పరిటాల సునీతకు తెలుగుదేశం పార్టీకి పెనుకొండ టికెట్‌ ఇచ్చిందని ఆయన విమర్శించారు. ఫ్యాక్షన్స్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతో తాము అభ్యర్థిని ఖరారు చేశామని ఆయన చెపాపు.

తెలుగుదేశం కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారని, పోలీసులపై దాడి చేశారని ఆయన అన్నారు. నామినేషన్‌ వేయడానికి హైదరాబాద్‌ నుంచి తెలుగుదేశం మహా మహా నాయకులు వెళ్లి అవాంఛనీయ సంఘటనకు కారకులయ్యారని ఆయన విమర్శించారు. దాడి చేసినవారిపై పోలీసులు లాఠీచార్జి చేసి, భాష్ప వాయువు ప్రయోగించి, కాల్పులు జరిపారని ఆయన వివరణ ఇచ్చారు. పెనుకొండ పరిస్థితి తెలిసి కూడా హైదరాబాద్‌ నుంచి తెలుగుదేశం నాయకులు వెళ్లడం తప్పని ఆయన అన్నారు. మూడేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు, పద్నాలుగేళ్ల పాటు మంత్రులుగా పని చేసిన నాగం జనార్దన్‌ రెడ్డి వంటి తెలుగుదేశం నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమని ఆయన అన్నారు.

ఫ్యాక్షన్‌ కుటుంబాలకు టికెట్‌ ఇవ్వకూడదనే నియమాన్ని పాటిద్దామని తాను తెలుగుదేశం పార్టీకి సూచించానని, అయితే దానికి చంద్రబాబునాయుడు ప్రతిస్పందించలేదని ఆయన అన్నారు. తన ప్రతిపాదనపై లోక్‌సత్తా వంటి సంస్థలు గానీ, మీడియా గానీ చర్చ చేయలేదని, చర్చ చేయనందుకు తాను మీడియాను కూడా నిందిస్తున్నానని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా మంత్రులు ఎన్‌. రఘువీరారెడ్డి గానీ, జె.సి. దివాకర్‌ రెడ్డి గానీ చీమకైనా హాని తలపెట్టారా అని ఆయన అడిగారు.

పరిటాల రవి తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయించవద్దని దివాకర్‌ రెడ్డిని బెదిరిస్తే మానుకోలేదా? అని ఆయన అడిగారు. నీకు కంఠం ఉంటే నా వద్ద ఖడ్గం ఉంది అని రవి రఘువీరా రెడ్డిని బెదిరించిన విషయాన్ని మరిచిపోయారా అని ఆయన అడిగారు. పెనుకొండ పరిస్థితి తెలుసు కాబట్టే తామెవరమూ ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని తాము ప్రకటించామని ఆయన చెప్పారు. సంఘటనా స్థలంలో కాంగ్రెస్‌ పార్టీవారెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X