పెనుకొండ ఎన్నిక: టిడిపిపై ఈసీకి కెకె ఫిర్యాదు
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి నారాయణరావుకు మంగళవారంనాడు ఫిర్యాదు చేశారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని విశాఖపట్నం జైలుకు తరలించాలనే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన నారాయణరావును కలిసిన అనంతరం విలేకరులతో చెప్పారు.
మోసపూరిత విధానాలతో పెనుకొండలో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వ్యూహాత్మకంగా అధికారులపై ఆరోపణలు చేస్తూ ఎన్నికను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టిడిపి యత్నిస్తోందని ఆయన అన్నారు. జైలులో ఉన్నవారు ఎన్నికలను ప్రభావితం చేస్తారనే ఆరోపణను తానెప్పుడూ వినలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుస్తున్న తీవ్రవాద సంస్థ ఆర్ ఓసి నుంచి తమ పార్టీవారికి ముప్పు ఉన్నదని ఆయన నారాయణరావుకు తెలియజేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియో చిత్రీకరణ జరపాలని, నిర్భయంగా ఓటు వేయగలమనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని ఆయన ఆయన నారాయణరావును కోరారు.
పెనుకొండలో 155 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించినట్లు నారాయణ రావు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 6 నుంచి 8 మంది పోలీసులను నియోగించనున్నట్లు ఆయన తెలిపారు. పది రోజుల ముందుగానే అదనపు పోలీసు బలగాలను పెనుకొండకు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
