కోర్టులో వెంకటేశ్వర్లును హాజరు పరిచిన పోలీసులు
నల్లగొండ: మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు అలియాస్ రవి కొరియర్ బండి వెంకటేశ్వర్లును పోలీసులు సోమవారంనాడు నల్లగొండ జిల్లాలోని భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. మావోయిస్టు మాజీ ప్రతినిధులు వరవరరావు, కళ్యాణరావు, గద్దర్లకు సివిల్ పంచాయతీలలో సంబంధాలున్నాయని తాను పోలీసులతో చెప్పలేదని బండి వెంకటేశ్వర్లు అంటున్నాడు. మీడియాతో బండి వెంకటేశ్వర్లును పోలీసులు మాట్లాడకుండా అడ్డుకున్నారు. వెంకటేశ్వర్లును వచ్చే నెల 13వ తేదీ వరకు రిమాండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మావోయిస్టు మాజీ ప్రతినిధులు మావోయిస్టు నేతలతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని సివిల్ పంచాయతీలు పరిష్కరించేవారని, కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) భూవివాదం పరిష్కారంలో వరవరరావు 50 లక్షల రూపాయలు తీసుకున్నారని బండి వెంకటేశ్వర్లు చెప్పినట్లు నల్లగొండ పోలీసు సూపరింటిండెంట్ మహేష్ ఎం. భగవత్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో చెప్పారు. ఈ ఆరోపణను వరవరరావు ఖండిస్తున్నారు. ఈ ఆరోపణపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఆయన అంటున్నారు.
మావోయిస్టు నేత బండి ప్రకాశ్ సోదరుడైన బండి వెంకటేశ్వర్లును నల్లగొండ జిల్లా చిట్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు సోమవారంనాడు కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications
