తెలంగాణ మనోభావాలకు టిడిపి వ్యతిరేకం: బిజెపి
హైదరాబాద్/కరీంనగర్: తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమేనని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగా ఉన్నదని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి తమదైన పద్ధతిలో కృషి చేస్తామని ఆయన అన్నారు.
ఆర్టీసి పరిరక్షణపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట మార్చారని ఆయన అన్నారు. ఆర్టీసికి రాయితీలు భర్తీ చేస్తామని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైయస్ అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు సమైక్యాంధ్ర తీర్మానం చేయడం సరి కాదని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. మహారాష్ట్ర గోదావరి నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.