పెద్ద రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం: విజయశాంతి
విశాఖపట్నం: తెలంగాణకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని సినీనటి విజయశాంతి అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి సోమవారం ఉదయం విశాఖపట్నం వచ్చిన విజయశాంతి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పెద్ద రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు.బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే తప్ప తనకు ఏ పదవిపై కూడా వ్యామోహం లేదని ఆమె స్పష్టం చేశారు. స్వార్థం కోసం తాను ఉద్యమం చేపట్టడం లేదని ఆమె చెప్పారు.
తెలుగుదేశం పార్టీ 9 ఏళ్ల పాలనలో చేసింది శూన్యమని ఆమె అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులకు బిసి, ఎస్సిల పేర్లు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని చేపట్టకుండా భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని అడ్డుకుంది తెలుగుదేశం పార్టీయేనని, తాను బిజెపిలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ గురించి మాట్లాడానని ఆమె అన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల కోసం కూడా తాను పోరాడుతానని ఆమె అన్నారు.