కాంగ్రెస్ అక్రమాలపై టిడిపి ఫిర్యాదు
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం శాసనసభ్యులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. పోలింగ్లో అక్రమాలు చేసేందుకు మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి పెనుకొండకు రెండు వేల మందికి పైగా తరలించారని వారు చెప్పారు. పెనుకొండలో పరిస్థితి అదుపు తప్పుతున్నందున పదే పదే ఫిర్యాదు చేయాల్సి వస్తోందని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవడం లేదని వారన్నారు. పెనుకొండలో డబ్బుల కట్టలు పంచుతున్నప్పుడు తీసిన ఫొటోలను వారు నారాయణరావుకు అందజేశారు.
పెనుకొండలో అసాధారణ రీతిలో జాగ్రత్త చర్యలు తీసుకున్నామని నారాయణరావు తెలుగుదేశం సభ్యులకు చెప్పారు. స్థానికేతరులను గుర్తించి బయటకు పంపుతున్నామని ఆయన చెప్పారు. అక్రమాలకు ఎవరూ పాల్పడినా చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు. ఎన్నికల పర్యవేక్షణకు జాయింట్ సి ఇవోను నియమించినట్లు ఆయన తెలిపారు.