ప్రత్యేక తెలంగాణకు బాబే బాధ్యుడు: వైయస్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో తెలంగాణ గురించి పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ వాదన ముందుకు వచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విషయంలో తాము రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి చెప్పారు.
తెలుగుదేశం మహానాడులో తన తప్పులపై సమీక్ష చేసుకోకపోవడం డబ్బు దండుగ తప్ప ప్రయోజనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పెనుకొండలో తమ ప్రతిపాదన మేరకు ఫాక్షన్తో సంబంధం లేనివారికి టికెట్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, పెనుకొండలో ఏడుగురి మృతికి దారి తీసిన పరిస్థితులకు చంద్రబాబే కారణమని ఆయన అన్నారు. సంస్కరణలకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
రెండు మూడు నెలల్లో సహకార ఎన్నికల నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నిలు పరోక్షమా, ప్రత్యక్షమా అనేది తాము ఇప్పటి వరకు చెప్పలేదని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం వంటి ఎన్నికల వాగ్దానాలను తన హయాంలో అమలు చేయని చంద్రబాబుకు తమను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు.