ప్రజా రచయితలకు 17 వరకు రిమాండ్
హైదరాబాద్: అరెస్టు చేసిన నలుగురు విప్లవ రచయితలను పోలీసులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో హాజరు పరిచగా వారిని ఈ నెల 17 వరకు రిమాండ్లో ఉంచవలసిందిగా మెజ్రిస్టేట్ ఆదేశించారు. మావోయిస్టు అగ్రనేత అయిన గంటి ప్రసాదం అలియాస్ ప్రభాకర్, మావోయిస్టు పార్టీ కడప, చిత్తూరు జిల్లాల మాజీ కార్యదర్శి యామసాని సురేందర్ అలియాస్ సుదర్శన్లను, విప్లవ రచయితల సంఘానికి చెందిన చెంచయ్య, ఎన్ వేణుగోపాల్, పినాకపాణి, సోమా రవికుమార్లను గురువారం నిజామాబాద్లో అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. తమను మే 31న మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోనే అరెస్టు చేసినట్టు మావోయిస్టు నాయకులు, విరసం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు మావోయిస్టు నాయకులను మినహాయించి నలుగురు ప్రజా రచయితలను బోధన్ కోర్టులో హాజరు పరిచారు.
వరవరరావు ఖండన
పత్రికా రచయితలను మావోయిస్టుల పేరిట అరెస్టు చేయడం అన్యాయమని మావోయిస్టుల మాజీ ప్రతినిధి వరవరరావు ఆరోపించారు. మావోయిస్టు నాయకుల అభిప్రాయాలను తెలుసుకోడానికి వెళ్ళిన పత్రికా రచయితలను మే 31 న అరెస్టు చేసి, నిన్న అరెస్టు చేసినట్టు అబద్దమాడుతున్నారని ఆయన శుక్రవారం నిజామాబాద్లో అన్నారు.