పివికి అపకీర్తి తెచ్చేలా మాట్లాడను: కళ్యాణ్
న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేతకు నాటి ప్రధాని పివి.నరసింహరావు ప్రభుత్వం మద్దతు పలికిందా అన్న లిబర్హాన్ కమిషన్ ప్రశ్నకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ శుక్రవారం సూటిగా జవాబివ్వకుండా దాటవేశారు. అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీమసీదును కూల్చివేయడానికి భారతీయ జనతాపార్టీ, విహెచ్పిలు పన్నిన కుట్రకు పివి.నరసింహరావు ప్రభుత్వం మద్దతు ఇచ్చిందా అని లిబర్హాన్ కమిషన్ సింగ్ను ప్రశ్నించింది. మరణించిన వారికి అపకీర్తి తెచ్చేలా మాట్లాడకూడదన్నది మన సంప్రదాయం. పివి.నరసింహరావుకు వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడను అని ఆయన కమిషన్కు బదులిచ్చారు. కమిషన్ విచారణలో భాగంగా, పివి మద్దతుతోనే బిజెపి, విహెచ్పి, సంఘ్పరివార్లు బాబ్రీ మసీదుకు కుట్ర పన్నాయా అని ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్ వీరేందర్ భాటియా, సింగ్ను ప్రశ్నించారు. రామజన్మభూమి వివాదానికి సంబంధించి 1990ల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నిర్వహించిన పాత్రపై కూడా సింగ్ గతంలో మౌనం వహించిన విషయం విదితమే. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద బాబ్రీ మసీదు తలుపులు తెరిచిన తరువాతే రామజన్మభూమి వివాదం మరింత తీవ్రరూపం దాల్చిందన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వాదనతో సింగ్ ఏకీభవించారు. కాంగ్రెస్ పాలనలో నవంబర్, 1989లో నిర్వహించిన శిలాన్యాస్ వల్ల రామజన్మభూమి ఉద్యమం ఇంకా బలపడిందన్న అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సింగ్ అంగీకరించారు. బిజెపి మద్దతుతో అక్టోబరు, 1990లో ధర్మసంసద్, విహెచ్పి, సాధుసంతులు కరసేవకు పిలుపునిచ్చారని, దాంతో ఉద్యమం మరింత బలోపేతం అయిందని సింగ్ అన్నారు.