ఆయుధ ముఠా పట్టివేత: ఇద్దరు నక్సల్స్ అరెస్టు
హైదరాబాద్: మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఆరుగురిని వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేయగా, ఇద్దరు మావోయిస్టులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠా సభ్యుల అరెస్టు విషయాన్ని వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వారి నుంచి రెండు 8 ఎం. ఎం. పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
బీహార్లోని ముంగేర్ జిల్లాలోని వారధి గ్రామంలో గల ఒక కర్మాగారం నుంచి ఈ ఆయుధాలను తీసుకొచ్చి మావోయిస్టులకు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయుధాలను మావోయిస్టులు ఆదాయానికి పనిముట్లుగా వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం సనుగుల వద్ద పోలీసులు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పోలీసులు రెండు గ్రెనేడ్లు, 162 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.