బిజెపి ధర్నా ఉద్రిక్తతం: పలువురి అరెస్టు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. బిజెపి కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ యత్నాల్లో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసిన బిజెపి సీనియర్ నాయకులు ఎం. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఎన్. ఇంద్రసేనారెడ్డి, కె. లక్ష్మణ్ వంటి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. ధరల పెరుగుదలపై తాము పార్లమెంటు లోపలా, వెలుపలా తమ ఆందోళనను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ప్రజల పక్షాన ఉన్నదెవరో తెలియజేస్తామని కూడా ఆయన అన్నారు.