ఎల్లంపల్లి ద్వారా తెలంగాణకు నీరు: పొన్నాల
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన ఎల్లంపల్ల బ్యారేజీ ద్వారా తెలంగాణలోని అన్ని మెట్ట ప్రాంతాలకు నీరందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. తనను కలిసిన ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) మంత్రులకు ఆయన సోమవారంనాడు ఆ హామీ ఇచ్చారు. తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. ప్రాణహిత నది నీటిని ఎల్లంపల్లి బ్యారేజీకి తరలించి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో అపోహలు అక్కర్లేదని ఆయన అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు పథకంలో మార్పులు చేస్తున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో టిఆర్యస్ మంత్రులు విజయరామారావు, హరీష్రావు, చంద్రశేఖర్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. ఎల్లంపల్లి ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించారని, అదే విషయాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఐదున్నర లక్షల ఎకరాలకు నీరందించే పరిస్థితులు లేకుండా ప్రాజెక్టులో మార్పులు చేస్తూ వెలువడిందనే అనుమానాలున్నాయని టి ఆర్యస్ మంత్రులు మంత్రికి వివరించారు.