విస్తారంగా వర్షాలు: 9మంది మృతి
హైదరాబాద్: గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు 9 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద 50 వేల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో 50 వేల రూపాయలేసి ఆర్థిక సహాయం అందించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ వర్షాలు మరో రెండు రోజులుంటాయని ఆయన చెప్పారు.
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనవసతి కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతంలో 40 పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు. పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సమీక్షించారు. ప్రతిజిల్లాలో కంట్రోల్రూమ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.