ఏజెన్సీ మరణాలపై న్యాయవిచారణ: టిడిపి డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు సోకి సంబవించిన మరణాలపై న్యాయవిచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల వివరాలను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, జాతీయ మానవ హక్కుల వేదికకు నివేదిస్తామని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. విషజ్వరాలు సోకి ఏజెన్సీ ప్రాంతాల్లో 936 మంది మరణించారని వారు చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలిన మాట నిజమేనంటూ మరణాలు మాత్రం సంభవించలేదని ప్రభుత్వం అనడాన్ని వారు వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వారన్నారు.