రిజర్వేషన్లపై ప్రధానికి బాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ప్రైవేట్ వృత్తి విద్యాసంస్థలో రిజర్వేషన్ల అమలుకు అవసరమైన రాజ్యాంగ సవరణను తేవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కోరారు. ఆయన సోమవారంనాడు ప్రధానిని కలిసి ఆమేరకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వృత్తి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. తాను చేసిన విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాల గురించి చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానిని కోరారు.
షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టు సాంకేతిక కారణాల వల్ల కొట్టివేసిందని, దీనిపై కూడా దృష్టి సారించాలని తాను ప్రధాని దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై కూడా ప్రధాని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కె. ఎర్రంనాయుడు, ఇతరులు ప్రధానిని కలిసినవారిలో ఉన్నారు.