కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంగానే ఉందా?: బిజెపి
హైదరాబాద్/ఖమ్మం/వరంగల్: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు వినతిపత్రం ఇవ్వడంపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీ నిధులను సాధించాలే గానీ వినతిపత్రాలు ఇవ్వడమేమిటని ఆయన అడిగారు.
మెదక్ జిల్లాలో ప్రధాని మన్మోహన్ కార్యక్రమం మొక్కుబడిగా సాగిందని ఆయన అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రధానికి ముఖ్యమంత్రి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. నక్సలైట్లతో చర్చలను కాంగ్రెస్ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగా మార్చిందని ఆయన అన్నారు. చర్చలను మూన్నాళ్ల ముచ్చటగా ఎందుకు మార్చారో, నక్సలైట్లపై నిషేధం ఎందుకు విధించారో ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
నక్సలైట్లపై నిషేధం విషయంలో పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్ జిత్ సేన్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్. విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని ఆయన సోమవారం ఖమ్మంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కలుసుకుని పరిస్థితిని పరిశీలించారు. నిధుల కొరతతో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వేటినీ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు. గోదావరి నదినే ఒక రిజర్వాయర్గా మార్చే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని ఆయన అన్నారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని విద్యాసాగర్ రావు వరంగల్లో అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన అన్నారు. 2009 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేది తమ లక్ష్యమని, మున్సిపల్ ఎన్నికలు దీనికి ప్రారంభమని ఆయన అన్నారు.