ఇక వైయస్ ప్రాజెక్టులబాట: పోలవరంతో షురూ
హైదరాబాద్: వివిధ నగరబాటలు చేపడుతున్న ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇక ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆయన ప్రాజెక్టు బాట ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా మొదటగా ఆయన ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుల బాటను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
ప్రాజెక్టుల బాట సందర్భంగా ముఖ్యమంత్రి వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చేపట్టిన పనులను, అవి అమలవుతున్న తీరును పరిశీలిస్తారు. భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీర్లతో మాట్లాడి పనులను తీరును పరిశీలిస్తారు. ప్రజలతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయమై పరిశీలన జరుపుతారు. జిల్లా అభివృద్ధి మండళ్ల సమావేశాల్లో కూడా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపే డిడి ఆర్సి సమావేశాలకు భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా హాజరవుతారని ఆయన ఇదివరకే చెప్పారు.