సుప్రీం వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర ప్రతిస్పందన
న్యూఢిల్లీ: ప్రైవేట్ వృత్తి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల విషయమై సుప్రీంకోర్టు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై లోక్సభ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని, అవాంఛనీయమైనవని బుధవారం లోక్సభలో సభ్యులు అన్నారు. చట్టాలను రూపొందించే హక్కును పార్లమెంటు వదులుకోదని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అన్నారు.
చట్టాలు రూపొందించే హక్కును మనం వదులుకోబోమని, వైరుధ్యాలను సృష్టించకూడదని, అవి నివారించదగినవేనని సోమనాథ్ ఛటర్జీ అన్నారు. చట్టసభలకు, న్యాయవ్యవస్థకు మధ్య విభేదాలు చోటు చేసుకోకూడదని లోక్సభ సభ్యులు అభిప్రాయపడ్డారు. కోర్టు లక్ష్మణరేఖ దాటడం మంచిది కాదని వారన్నారు. లెజిస్లేచర్కు కొన్ని హక్కులున్నాయని, అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు రాజ్యాంగం కింద తనకున్న హక్కుల మేరకు వ్యవహరిస్తుందని, అదే విధంగా కోర్టులకు కూడా కొన్ని హక్కులున్నాయని, అవి ఆ పరిధిలోనే పని చేయాలని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అన్నారు.