ప్రధాని పిలుపు విడ్డూరం: మావోయిస్టులు
హైదరాబాద్: ప్రభుత్వాలు సామాన్యులను చంపకుండా పౌరహక్కులను కాపాడితే హింస దానంతటదే తగ్గుతుందని సిపిఐ (యంయల్) మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జనార్దన్ అన్నారు. బూటకపు ప్రజాస్వామ్యంలోకి తమను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆహ్వానించడం విడ్డూరమని ఆయన అన్నారు. జనార్దన్ పేర విడుదల ఒక లేఖ మీడియా కార్యాలయాలకు చేరింది. వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నాయకులపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ఆయన అడిగారు. గత 50 యేళ్లలో ప్రజల కనీసావసరాలైన కూడు, గుడ్డ, గూడు వంటివాటిని కల్పించకపోవడం వల్లనే తాము నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పోరాడాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, డిజిపి స్వరణ్జిత్ సేన్ మీడియాపై చేసిన విమర్శల నుంచి బయటపడడానికే ప్రధాని మీడియాను ఆకాశానికెత్తారని ఆయన అన్నారు. తాము నిజమైన ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తాము తప్పులు చేస్తే ప్రజలను క్షమాపణ కోరుతామని, తప్పులకు తాము బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. డిజిపిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. గుజరాత్ హింసాకాండ, ముఠాకక్షలతో హత్యలు ప్రభుత్వాల వల్ల జరుగుతున్నవేనని ఆయన అన్నారు.
మావోయిస్టులపై నిషేధం ఎత్తేయాలని జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అమర్ మరో లేఖలో డిమాండ్ చేశారు. నల్లమల, గోదావరిలోయ, కళింగాంధ్ర కొండల్లో మోహరించిన బలగాలను వెనక్కి పిలవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన జనశక్తి నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
