ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో మ్యానిఫెస్టో: పిసిసి
హైదరాబాద్: ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యవర్గం నిర్ణయించింది. బుధవారం పార్టీ కార్యాలయం గాంధీభవన్లో జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుతో పాటు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యదర్శి జయకుమార్ పాల్గొన్నారు.
మిత్రపక్షాలతో ఎన్నికల అవగాహనను కొనసాగించాలని కూడా పిసిసి కార్యవర్గం నిర్ణయించింది. అయితే సీట్ల సర్దుబాటు స్థానికంగానే ఉంటుందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు ఇప్పటికే ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల కోసం మీడియా మేనేజ్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇంటిపన్నును క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ పిసిసి కార్యవర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.