మద్యం టెండర్లలో అక్రమాలు: బాబు ఆరోపణ
కావలి: మద్యం టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆయన శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని ఆయన అన్నారు. మద్యం విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చెట్ల కింద మద్యం అమ్మే దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతోందని ఆయన అన్నారు. మద్యం షాపులను ఎందుకు మారుస్తున్నారని ఆయన అడిగారు. మద్యం విధానాన్ని కాంగ్రెస్కు అనుకూలంగా మార్చారని, మాఫియా ముఠాలకు, రాజకీయ నాయకులకు మద్యం షాపులను కట్టబెట్టే పద్ధతిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరస్థులతో, అవినీతిపరులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. ఎన్ని అక్రమ, అవినీతికర సంఘటలు చోటు చేసుకున్నా ఏ ఒక్క అధికారిపై చర్య తీసుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్వారు దేవుడికి కూడా భయపడడం లేదని, డబ్బులు ఎక్కడుంటే అక్కడ వాలుతున్నారని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను ఆచూకీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి తెలుసునని ఆయన అన్నారు.