విరసం నేతలపై పోలీసు వేధింపులు: హేమలత
హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేతలను పోలీసులు వేధిస్తున్నారని విప్లవకవి వరవరరావు భార్య హేమలత రాష్ట్ర మానవ హక్కుల కమీషన్కు ఫిర్యాదు చేశారు. విరసం నేతల కేసులన్నింటినీ హైదరాబాద్లోనే విచారించేలా చర్యలు తీసుకోవాలని ఆమె మంగళవారం మానవ హక్కుల కమీషన్కు విజ్ఞప్తి చేశారు. నర్సా కోబ్రాస్, నయామ్ ముఠా వంటి ప్రైవేట్ మాఫియా ముఠాల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వరవరరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడమే కాకుండా పాత కేసులు తవ్వితీస్తున్నారని ఆమె చెప్పారు. కేసు మీద కేసు పెట్టి వివిధ ప్రాంతాలకు తిప్పుతుండడం వల్ల వరవరరావు ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా పోలీసు, ప్రైవేట్ మాఫియాల నుంచి ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లుతుందని ఆమె అన్నారు. అనంతపురం జిల్లా మదిగుబ్బలో కానిస్టేబుల్ను ప్రజలు కొడుతుంటే వరవరరావు తప్పించి పంపించివేశారని, పరిస్థితి ఇలా ఉంటే వరవరరావుపై పోలీసు కేసు బనాయించారని ఆమె అన్నారు.