చిదంబరం రాజీనామాకు పట్టు: పార్లమెంటులో రభస
హైదరాబాద్: ఆర్థిక మంత్రి చిదంబరం సతీమణి, సీనియర్ న్యాయవాది నళిని ఆదాయం పన్ను శాఖ తరఫున కేసులు వాదిస్తున్న వ్యవహారంపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. నళిని వ్యవహారంపై సోమవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర రభస జరిగింది. తన భార్య కేసులు వాదిస్తున్న విషయం తనకు తెలియదని చిదంబరం స్పష్టం చేసినా అన్నాడియంకె, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ) పక్షాల సభ్యులు వినిపించుకోలేదు.
నళిన వ్యవహారంపై గందరగోళం చెలరేగడంతో మంగళశారం ఉదయం రాజ్యసభ గంటపాటు వాయిదా పడింది. ఆదాయం పన్ను శాఖ తరఫున నళిని వాదిస్తుండడంపై వివరణ ఇచ్చేందుకు చిదంబరం సభకు రావాలని అన్నాడియంకె మెంబర్ ఎన్. జోతి పట్టుబట్టారు. అన్నాడియంకె సభ్యులు ఈ డిమాండ్పై గొడవకు దిగారు. వారికి బిజెపి సభ్యులు తోడయ్యారు. ఎంతకూ సద్దుమణగకపోవడంతో చైర్మన్ బైరాన్ సింగ్ షెకావత్ సభను గంటపాటు వాయిదా వేశారు.
తన భార్య వ్యవహారానికి బాధ్యత వహించి చిదంబరం మంత్రిపదవికి రాజీనామా చేయాలని బిజెపి సభ్యులు లోక్సభలో డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తనకు విషయం తెలియదని చిదంబరం ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.