వినుకొండ ఎన్కౌంటర్ మృతుల్లో మోహన్
గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఒక నక్సలైట్ను పోలీసులు గుర్తించారు. ఒకరిని ప్రకాశం జిల్లా మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు మోహన్ అలియాస్ సుంకున్నగా గుర్తించారు. అతను కర్నూలులోని ఎన్టీఆర్ కాలనీకి చెందివాడని వారు చెప్పారు.
గుంటూరు జిల్లా వినుకొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో గల నరగాయపాలెం వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. అయితే వారిని ఆ సమయంలో పోలీసులు గుర్తించలేదు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం - సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పదిన్నర గంటల ప్రాంతంలో హీరోహోండాపై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి తమ వాహనాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాహనం కింద పడింది. వెంటనే యువకులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో యువకులు ఇద్దరు మరణించారు.