అక్రమాలకు కాంగ్రెస్ వ్యూహం: చంద్రబాబు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు కాంగ్రెస్ సిద్ధపడిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఉందని, అందుకు వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ శివారులోని 12 మున్సిపాలిటీలకు కూడా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన రంగారెడ్డి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో వారు ఈ డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల బిసి, ఎస్సిలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందని టి ఆర్యస్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియను తిరిగి చేపట్టాల్సి వుంటుందని ఆయన అన్నారు. అలా చేపట్టకపోవడం వల్ల బిసిలకు, ఎస్సిలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల ఎన్నికల కోసం చివరి దాకా పోరాడుతామని తెలుగుదేశం శాసనసభ్యుడు సాయన్న చెప్పారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకు తీర్మానం చేద్దామని తెలుగుదేశం, టిఆర్యస్ సభ్యుల విజ్ఞప్తిని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తోసిపుచ్చారు. విషయం కోర్టులో ఉన్నదని, కోర్టు తీర్పు వచ్చే వరకు నిరీక్షించాల్సి వుంటుందని ఆయన అన్నారు.