ప్లీనం గర్వకారణం: వైయస్, ఢిల్లీలో బిజీ
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సమావేశాలు హైదరాబాద్లో జరగడం గర్వకారణమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎఐసిసి సమావేశాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆయన న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఎఐసిసి సమావేశాలను సమర్ధంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 30 యేళ్ల తర్వాత హైదరాబాద్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయని, మధ్యలో 1992లో తిరుపతిలో జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఎఐసిసి సమావేశాలు హైదరాబాద్లో జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధిని దేశానికి తెలియజేసేందుకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.
రాజశేఖర్ రెడ్డితో పాటు కేశవరావు మంగళవారంనాడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కలిశారు. ఆయనతో ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై, మున్సిపల్ ఎన్నికలపై చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం ఇరువురు నాయకులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలుసుకున్నారు. రేపు సాయంత్రం సోనియా గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మంగళవారం సాయంత్రం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్పవార్ను కలుసుకున్నారు.
కరువు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు మరో 5 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శరద్ పవార్ను కోరారు. రెండు లక్షల టన్నుల బియ్యం ఇచ్చేందుకు శరద్ పవార్ అంగీకరించారు.












Click it and Unblock the Notifications
