సచివాలయంలోకి చొరబడిన విద్యార్థులు: లాఠీచార్జి
హైదరాబాద్: సచివాలయంలోకి చొచ్చుకుపోయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలపై బుధవారం పోలీసులు లాఠీచార్జి చేశారు. పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ ఎబివిపి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి దిగింది. విజిటర్స్ లాగా విడిగా ఎబివిపి కార్యకర్తలు సచివాలయంలోకి ప్రవేశించారు. అనంతరం అందరూ గుమిగూడి సచివాలయంలో నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఈ అనూహ్య పరిణామానికి పోలీసులు విస్తుపోయారు. వెంటనే తేరుకుని విద్యార్థులను వెలుపలికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు అక్కడే బైఠాయించి కదలడానికి నిరాకరించారు.
విద్యార్థులను సచివాలయం వెలుపలికి పంపించడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. బిసి, ఎస్సి, ఎస్టి పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎబివిపి విద్యార్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డిని బిసి ద్రోహిగా అభివర్ణిస్తూ నినాదాలు చేశారు. దీంతో సచివాలయంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలయం వెలుపలికి వచ్చిన తర్వాత ఎబివిపి కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. లాఠీచార్జిలో పది మంది దాకా గాయపడ్డారు.