మూడో ఫ్రంట్ ఏర్పాటు మాకే మేలు: బిజెపి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పినట్లు జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పడితే తమ పార్టీకే మేలు జరుగుతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ అన్నారు. తృతీయ ఫ్రంట్లో ఏయే పార్టీలుంటాయో వెల్లడించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతో తమకు పొత్తు లేకుంటేనే మంచిదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
టిడిపితో పొత్తు వల్ల గత శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని స్థానాల్లో నష్టపోయిందని ఆయన అన్నారు. టిడిపితో పొత్తు లేకపోవడం వల్ల తమ పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ప్రకటనను తాము ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని బిజెపి మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు ఓటు హక్కు కల్పించడం ద్వారా దొడ్డిదారిలో పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.