మా బలం తక్కువేమీ కాదు: నారాయణ
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని, గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన విజయవాడలో అన్నారు. కాంగ్రెస్తో గానీ, తెలుగుదేశంతో గానీ వామపక్షాల పొత్తులు శాశ్వతం కాదని నారాయణ అన్నారు. తాము ప్రత్యామ్నాయంగా బలపడడానికి వీలుగానే పొత్తులు ఉంటాయని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపితో తెగదెంపులు చేసుకోవడంతోనే సరిపోదని, చంద్రబాబు అనుసరించే ఆర్థిక విధానాలు కూడా ప్రధానపాత్ర వహిస్తాయని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలతో మూడవ ప్రత్యామ్నాయం ఆచరణ సాధ్యం కాదని, తాము ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
వెన్నుపోట్లకు తావు లేని పొత్తులను తాము కోరుకుంటున్నామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. అధికారం కోసం వెన్నుపోట్లు పొడిచే పొత్తులను తాము వ్యతిరేకిస్తామని, పొత్తులో నిజాయితీని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. అవసరమైతే వామపక్షాలు ఒంటరిగా పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. బిజెపి, తెలుగుదేశం పార్టీలను ఓడించేందుకు సెక్యులర్ పార్టీలతో పొత్తులను కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, వామపక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. సగం డివిజన్ల కోసం వామపక్షాలు పట్టుబడుతుండగా 16కు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ చెబుతోంది. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో విజయవాడలో కాంగ్రెస్ వామపక్షాలతో చర్చలు ప్రారంభించింది. విజయవాడలోని మొత్తం 59 స్థానాల్లో 30 స్థానాలు తమకు ఇవ్వాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 16కు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ వామపక్షాలకు తేల్చి చెప్పింది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
కమ్యూనిస్టుల బలం అధికంగా ఉన్న ఖమ్మంలో సర్దుబాట్ల కోసం మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధులు వామపక్షాల నాయకులతో చర్చలు ప్రారంభించారు.