మెట్పల్లి, వెంకటగిరి మున్సిపాలిటీలకూ ఎన్నికలు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మున్పిపాలిటీల స్టేటస్కోను రాష్ట్ర హైకోర్టు తొలగించింది. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ రెండు మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ను నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా వెలువరించనున్నట్లు ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డి చెప్పారు. ఓటర్ల జాబితాలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. హైకోర్టు స్టేటస్కోను తొలగించిన తర్వాత ఎన్నికల కమీషన్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకొని ఆ రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించడానికి తగిన షెడ్యూల్ను రూపొందించుకుంది.
రిజర్వేషన్లకు సంబంధించి పునర్విభజన అంశం తమ పరిధిలో లేదని ఎ.వి.యస్. రెడ్డి చెప్పారు. శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల ఓటుహక్కు విషయంలో చట్టపరమైన ఇబ్బందులున్నాయని ఆయన చెప్పారు. రేషన్కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రేషన్కార్డుల విషయంలో ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేసింది.