మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగనున్నాయి. లీటర్కు రెండు నుంచి మూడు రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముడిచమురు ధరలను సమీక్షించిన ధరలు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోలియం శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ విదేశీ పర్యటనలో ఉండడంతో పెంపు అమలును వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఆయన తిరిగి రాగానే ఈ పెంపు అమలులోకి వస్తుంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ధరలు పెంచాల్సిన అనివార్యతలో పడ్డామని, అయితే ఈ పెంపు ఈ నెల 7వ తేదీ తర్వాతనే అమలులోకి వస్తుందని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. మణిశంకర్ అయ్యర్ నార్వే, ఐస్లాండ్, బంగ్లాదేశ్ పర్యటనలను ముగించుకుని ఈ నెల 7వ తేదీన దేశానికి తిరిగి వస్తున్నారు. పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ డ్యూటీపై కోత విధించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలనే కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వంటగ్యాస్ ధర కూడా పెరిగే అవకాశాలున్నాయి. సిలిండర్ గ్యాస్ ధర 20 రూపాయలు పెరిగే అవకాశం ఉంది.