మరోసారి యుద్ధం ఎఫెక్ట్: భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాల వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న చమురు ధరల్లో ఇటీవలి కాలంలో భారీ మార్పు వచ్చింది. ప్రస్తుతం ఒక్కో బ్యారెల్ చమురు ధర 105 డాలర్లకు పైమాటే అని తెలుస్తోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతిపై ఆధార పడిన దేశాలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. భారత్ కూడా ఆ దేశాల లిస్టులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
భారత్ తన చమురు దిగుమతుల్లో 45 శాతం నుంచి 60 శాతం వరకు హార్మూజ్ జలసంధి గుండానే పొందుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్ దేశాల నుంచి భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది భారత్. అయితే తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ ధరల ప్రభావం పేద, మధ్య తరగతి దేశాలతోపాటు భారత్ లాంటి అధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలపైనా పడింది. దాంతో భారత్ లో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్- అమెరికా నియంత్రణలో మగ్గుతోంది.
హార్మూజ్ జలసంధిపై పెత్తనం కోసం ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో ఘర్షణలకు దిగుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ అడుగు ముందుకేసి మరీ హార్మూజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అని పేర్కొన్నారు. అంతేకాక హార్మూజ్ ను అమెరికా భూభాగంలో ఉన్నట్లు మ్యాప్ కూడా విడుదల చేశారు. అటు ఇరాన్ మాత్రం హార్మూజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు రవాణా కావాల్సిన చమురు నౌకలు సందిగ్ధంలో పడ్డాయి. ఆంక్షల కారణంగా రవాణా క్లిష్ట తరంగా మారుతోంది.

ఇదిలాఉంటే ఇటీవల మే లో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలిసిందే. ఇరాన్- అమెరికా యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు భారత్ లో ఏకంగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారత్ లో భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే భారత్ వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని ధరలు పెరిగే అవకాశం లేదని కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాక చమురు దిగుమతి విషయంలో భారత్ ఒక్క దేశంతో కాకుండా అనేక దేశాలతో బిజినెస్ చేస్తోందని అందువల్ల భారత్ పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 10 నాటికి భారత్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 103 గా ఉంది. ఈ లెక్కన అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు పెరిగినా ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో ధరలు స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
