టిఆర్యస్ చిరునామా గల్లంతు: టిడిపి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) ఉనికి ఉండదని తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టి ఆర్యస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని, టిఆర్యస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గత్యంతరం లేకనే తాము ఒంటరిగా పోటీ చేస్తామని టిఆర్యస్ నాయకుడు కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారని వారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్యస్ ఓడిపోవడం ఖాయమని, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కాంగ్రెస్ ఓడిపోతుందని వారన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని వారన్నారు. కాంగ్రెస్, టి ఆర్యస్లు కలిసి ప్రజలను మోసం చేశాయని, ఇప్పుడు పరస్పరం మోసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని వారన్నారు. కెసిఆర్ను కాంగ్రెస్ వారు మోసేంత వరకు మోశారని, ఇప్పుడు పొమ్మంటున్నారని, దీంతో మరో మార్గం లేక ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నారని, కెసిఆర్ అవకాశవాదానికి ఇది తార్కాణమని వారన్నారు. తెలంగాణ తెస్తామని చెప్పి పదవులు, డబ్బులు సంపాదించుకున్న చంద్రశేఖర్ రావును ప్రజలు నమ్మబోరని వారన్నారు.