పట్టణాభివృద్ధిపై టిడిపివి అబద్ధాలు: కిరణ్కుమార్
హైదరాబాద్: పట్టణాభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఛీఫ్ విఫ్ కిరణ్కుమార్ రెడ్డి విమర్శించారు. గతంలో కన్నా పట్టణాభివృద్ధికి ఎక్కువ చేశామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, ఆయితే నిజానిజాలు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
రాజీవ్ నగరబాటకు 50 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారంటూ దాని వల్ల అభివృద్ధి ఎలా సాధ్యమని తెలుగుదేశం పార్టీ అంటోందని, తెలుగుదేశం పార్టీ మాటల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. గత 40,50 ఏళ్లలో ఇవ్వని నిధులు ఒక్క ఏడాదిలో తాము పట్టణాభివృద్ధికి కేటాయించామని ఆయన అన్నారు. గృహనిర్మాణ పథకాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రమంతా 8 లక్షల 20 వేల గృహాలు నిర్మిస్తుండగా, పట్టణాల్లోనే 3 లక్షల 70 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. ఈ 3 లక్షల 70 వేల గృహాల్లో రెండు లక్షలు రాజీవ్ గృహకల్ప కింద మంజూరు చేయగా లక్షా 70 వేల ఇళ్లు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.