ఛత్తీస్ఘడ్లో మందుపాతరకు 23 మంది బలి
రాయ్పూర్: ఛత్తీస్ఘడ్ బిజాపూర్ జిల్లాలో నక్సల్స్ శక్తివంతమైన మందుపాతర పేల్చిన సంఘటనలో 23 మంది కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు (సిఆర్పియఫ్కు) చెందిన 23 మంది జవాన్లు మరణించారు. ముఖ్యమంత్రి రామన్ సింగ్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికి తీసినట్లు, మిగతా ఏడు శవాలు వాహనంలోనే చిక్కుపోయినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటన బిజాపూర్కు 12 కిలోమీటర్ల దూరంలో గల పెదెడ గ్రామం వద్ద జరిగింది.
మరణించినవారిలో 21 మంది సి ఆర్పియఫ్ 87వ బెటాలియన్కు చెందినవారు కాగా, ఇద్దరు బిజాపూర్ పోలీసు బలగాలకు చెందిన జవాన్లు ఉన్నారు. గాయపడిన ముగ్గురిని హెలికాప్టర్లో రాయ్పూర్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. డిజిపి ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోం మంత్రి రామ్ విచార్ నేతమ్ పరిస్థితిని అంచనా వేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీన్ని దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు.