బాలెంలలో ఎన్నారైల చేత హాస్టల్ భవనం
సూర్యాపేట: సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో స్ప్రెడ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటయిన హాస్టల్ భవనాన్ని రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ ఇటీవల ప్రారంభించారు. అనాథ, నిరుపేద బాలల కోసం స్ప్రెడ్ ఇండియా ఈ హాస్టల్ను ఈ ఏడాది జులైలో ప్రారంభించినట్లు స్ప్రెడ్ ఇండియా కో ఫౌండర్, ప్రెసిడెంట్ అమెరికాలోని డెట్రాయిట్లో ఉంటున్న శ్రీధర్ పటేల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనాథ, నిరుపేద విద్యార్థుల కోసం స్ప్రెడ్ ఇండియా హాస్టల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆకారపు సుదర్శన్ అన్నారు.
అత్యధిక మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. పేద విద్యార్థులకు లక్షా రెండు వేల రూపాయల చెక్కులను, బిట్స్ పిలానీలో సీటు సాధించిన చంద్రశేఖర్కు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా సత్యనారాయణ స్ప్రెడ్ ఇండియా సేవలను అభినందించారు. మాజీ శాసనసభ్యుడు దోసపాటి గోపాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.