విజయవాడలో తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట
విజయవాడ: టికెట్ల కోసం విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం కుమ్ములాటలకు దిగారు. పార్టీ కార్యాలయంలో వారు గలాభా సృష్టించారు. నామినేషన్లు వేయడానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో, టికెట్లను నాయకులు అమ్ముకున్నారనే వదంతులు ప్రచారంలోకి రావడంతో కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురై అలజడి సృష్టించారు. ఈ గలాభా జరుగుతున్న సమయంలో పార్టీ నాయకులెవరూ కార్యాలయంలో లేరు. ఒక హోటల్లో పార్టీ నాయకులు టికెట్లను ఖరారు చేయడంలో మునిగిపోయారు.
ఇదిలావుంటే, టికెట్ల పంపిణీలో తెలుగుదేశం నాయకులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ విజయవాడలోని తెలుగు దేశం దళిత మహిళలకు పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడించడానికి పని చేస్తామని వారన్నారు. తెలుగుదేశం నగర ప్రధాన కార్యదర్శి తన అనుచరులకు మాత్రమే టికెట్లు ఇప్పించుకుంటున్నారని వారన్నారు.