చార్జీల పెంపుపై నీళ్లు నములుతున్న ఆర్టీసి
హైదరాబాద్: బస్సు చార్జీల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ఆర్టీసి) చైర్మన్ గోనె ప్రకాశరావు నీళ్లు నములుతున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో రెండు మూడు నెలల్లో ఆర్టీసి చార్జీలు పెంచక తప్పదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారావు గురువారం ప్రకటించారు. అయితే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవడంతో ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
బస్సు చార్జీలు పెంచే యోచన లేదని గోనె ప్రకాశరావు శుక్రవారంనాడు మీడియా ప్రతినిధులతో చెప్పారు. 2006 మార్చి దాకా ఆర్టీసి చార్జీలు పెంచకూడదని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలా, వద్దా అనేది ఆలోచించాల్సి ఉన్నదని ఆయన అన్నారు.