కాంగ్రెస్ దౌర్జన్యాలకు భయపడవద్దు: బాబు పిలుపు
అనంతపురం: కాంగ్రెస్ దౌర్జన్యాలకు భయపడకుండా ధైర్యంగా నిలబడి తమ పార్టీని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారంనాడు అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను మట్టుబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోందని, ఇందులో భాగంగానే పరిటాల రవిని హత్య చేశారని ఆయన అన్నారు.
మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడి ఆగడాలను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు శాసనసభ్యురాలు పరిటాల సునీత, తదితర నాయకులు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. అనంతపురంలో కాంగ్రెస్ గెలిస్తే అనేక సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. ముస్లింలకు రాజకీయాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.