తెలంగాణతో పెట్టుకుంటే వైయస్ కనుమరుగు: కెసిఆర్
వరంగల్: తెలంగాణతో పెట్టుకుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డియే కనుమరగువుతారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణతో పెట్టుకుని మొన్న కాసు బ్రహ్మానంద రెడ్డి, నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పల్టీ కొట్టారని, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పల్టీ కొట్టక తప్పదని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం వరంగల్లో ఏర్పాటయిన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నామని, అయితే ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నాయకుల కోరిక మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామని ఆయన చెప్పారు. టిఆర్యస్పై అభాండాలు వేయడం మానుకొని నక్సల్స్తో చర్చలను పునరుద్ధరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగరణ సేన (టిజెయస్) ఏర్పాటు వెనక ఏ విధమైన దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరంగల్ నగరం వెనకబడి పోయిందని, వరంగల్కు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని, వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు తాను ప్రయత్నాలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్లో పర్యటన చేసిన అనంతరం ఆయన మెదక్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును కలిసినందుకు తనను జైల్లో పెట్టాలనుకుంటే ముందు నక్సల్స్తో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని పెట్టాలని చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా సిద్ధిపేటలో అన్నారు. శాంతియుత తెలంగాణ సాధన కోసమే తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం తాను ఆత్మత్యాగానికైనా సిద్ధమని ఆయన అన్నారు. తమ నేత ఎ. నరేంద్ర మాటలను కాదు, ఆ మాటల వెనక గల భావాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. నరేంద్ర మాటలపై రాద్దాంతం చేస్తూ అసలు విషయాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.