బాబు నిర్ణయాల్లో ఆరు రద్దు చేయాలి: రోశయ్య
హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాల్లో ఆరింటిని రద్దు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు ఆర్థిక మంత్రి కె. రోశయ్య తెలిపారు. 2003 జనవరి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలపై విచారణ జరపడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయింది. ఈ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రద్దు చేయాల్సిన ఆరు విధాన నిర్ణయాలేవనేది రోశయ్య వెల్లడించలేదు.
మెగా ప్రాజెక్టుల ఏర్పాటు, భూముల కేటాయింపులకు సంబంధించిన 61 విధాన నిర్ణయాలను పరిశీలించినట్లు రోశయ్య బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. 45 నిర్ణయాల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని, పది విషయాల్లో నిర్ణయం తీసుకోలేకపోయామని, ఆరు నిర్ణయాలను రద్దు చేయాలనే అభిప్రాయానికి వచ్చామని ఆయన వివరించారు.
ఐయంజి భారత్ కంపెనీకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో భూమి కేటాయింపు నిర్ణయాన్ని రద్దు చేయాల్సిందేనని రోశయ్య అన్నారు. వందలాది కోట్ల రూపాయల విలువ చేసే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు నాయుడు అతి తక్కువ ధరకు ఐయంజికి కేటాయించారని ఆయన అన్నారు. ఐయంజి కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని, అయితే న్యాయపరమైన చిక్కుల విషయమై పరిశీలన జరపాల్సి ఉందని ఆయన అన్నారు.