నిజాయితీగా జరిగితే పులివెందులలోనూ పాగా: బాబు
రాజమండ్రి: మున్సిపల్ ఎన్నికలు నిజాయితీగా జరిగితే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో కూడా తాము గెలుస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ఆయన బావమరిది కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి)ని నష్టాల ఊబిలోకి నెడుతున్నారని నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారంనాడు తూర్పు గోదావరి జిల్లాలో రోడ్షో నిర్వహించారు.
తమ తొమ్మిదేళ్ల పాలనలో గ్యాస్ కొరత లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 330 మంది చేనేత కార్మికులు మరణించినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బోర్లకు కొరత ఉంది కానీ బార్లకు కొరతలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒక వైపు ఉంటే, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నాయకుడు మరో వైపు ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు.