ఆరు జిల్లాలు అతలాకుతలం: 50 మందికి పైగా మృతి
హైదరాబాద్: తుఫాను తాకిడి రాష్ట్రంలోని ఆరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తన ప్రతాపాన్ని చూపిన తుఫాను మంగళవారం ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉంది. తుఫాను తాకిడికి ఇప్పటి వరకు 50 మందికిపైగానే మరణించారు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే 9 మంది మరణించినట్లు సమాచారం. విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు.
గోదావరి నదిలో వరద ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో భద్రాచలంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భద్రాచలం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను మురికిరేవులో 40 మంది నీటి మధ్య చిక్కుకున్నారు. కొత్తగూడెం డివిజన్లో 15 మంది జలదిగ్బంధంలో ఇరుక్కున్నారు. విజయవాడలోని ఒక ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి ముగ్గురు మరణించారు. ఖమ్మం జిల్లాలో గోదావరి నది వరద నీటిలో 33 గ్రామాలు చిక్కుకున్నాయి. గిరిజన ప్రాంతాల్లో 200 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఇల్లెందు ప్రాంతంలో ఇరవై మంది నీటిలో చిక్కుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటమట్టం 50 అడుగులకు చేరుకుంది.
గుంటూరు జిల్లాలో కూడా వర్షాల తాకిడి వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. నల్లవాడు పొంగిపొర్లడంతో నలుగురు గల్లంతయ్యారు. నర్సారావుపేట సమీపంలో వల్లప్ప చెరువు తెగింది. ఈ ప్రాంతంలో వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నల్లగొండ జిల్లా మీగడపాడు తండాలో విద్యుత్ వైర్లు తెగిపడి ఒకరు మరణించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు గల్లంతయ్యారు. విశాఖపట్నం వద్ద చేపల వేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు.
పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. 12 రైళ్లను దారి మళ్లించగా, ఏడు రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్య గోదావరి ఎక్ప్ప్రెస్ రద్దయింది. విశాఖపట్నం నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.
విజయవాడలోని విజయదుర్గా నగర్, రాజరాజేశ్వరిపేట, మధురా నగర్లలోకి బుడమేరు పొంగిపొర్లడంతో నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎర్రకాలువ ఉధృతంగా పొంగిపొర్లడంతో నల్లచెర్ల వద్ద రాజమండ్రి రహదారిపైకి నీరు చొచ్చుకురావడంతో వాహనాల రాకపోకలు ఆగిపోపయాయి. ఖమ్మం జిల్లాలోని సింగభూపాలెం చెరువుకు గండి పడింది. దీంతో ఐదు వేల ఇళ్లు మునిగిపోయాయి. పది వేల మంది నిరాశ్రయులయ్యారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో ఏడుగురు వరదల్లో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో హెలికాప్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో తిరువూరు వైపు వెళ్లే బస్సులను రద్దు చేశారు. కృష్ణా జిల్లాలో 16 వేల హెక్టార్ల వరి పంట, 2600 హెక్టార్ల పత్తి పంట, 7700 హెక్టార్ల చెరుకు పంట వరదల్లో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications
