కార్పోరేషన్లలోనూ హస్తానిదే హవా
హైదరాబాద్: నగర పాలక సంస్థల్లో కూడా కాంగ్రెస్ గెలుపు జెండాను ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన పది కార్పోరేషన్లలో ఎనిమిది కార్పోరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకునే బలాన్ని సంపాదించుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థ కూడా కాంగ్రెస్కు దక్కేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కరీంనగర్ నగర పాలక సంస్థలో మాత్రం ఏ పార్టీకి తగిన మెజారిటీ రాలేదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మేయర్ పదవి దక్కే అవకాశాలు తక్కువే ఉన్నాయి.
కరీంనగర్ నగర పాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ 15 డివిజన్లను గెలుచుకోగా కాంగ్రెస్ 13 డివిజన్లను దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక డివిజన్ మాత్రమే లభించింది. బిజెపికి రెండు, మజ్లీస్కు 9 డివిజన్లు వచ్చాయి. ఇతరులు పది మంది గెలిచారు. దీంతో ఈ కార్పోరేషన్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితిలో కౌంటింగ్ సెంటర్ నుంచే ఇండిపెండెంట్లను తరలించుకుపోయే కార్యక్రమానికి కరీంనగర్లో శ్రీకారం చుట్టారు. ఇండిపెండెంట్లకు లక్షలాది రూపాయలు ఇచ్చి తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
నెల్లూరులో కాంగ్రెస్కు మేయర్ పదవి దక్కించుకునేందుకు తగిన మెజారిటీ రానప్పటికీ పరిస్థితులు కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. ఇక మిగతా నగర పాలక సంస్థల్లో కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ డివిజన్లు దక్కాయి. గుంటూరు, కర్నూలు, నిజామాబాద్, అనంతపురం, వరంగల్, కడప, ఏలూరు నగర పాలక సంస్థల మేయర్ పదవులను కాంగ్రెస్ దక్కించుకోవడానికి ఏ మాత్రం అడ్డంకులు లేవు. నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి డి. శ్రీనివాస్ కుమారుడు సంజయ్ స్వల్ప మెజారిటీతో కార్పోరేటర్గా విజయం సాధించారు. గుంటూరులో మేయర్ పదవికి కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుమారుడు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రాయపాటి కుమారుడు, కాంగ్రెస్ శాసనసభ్యుడు వెంకట్రావు సోదరుడు మేయర్ పదవికి పోటీ పడుతున్నారు.